భారత దేశ జనాభా ఎక్కువ. భారత దేశ ఓటర్ల జనాభా కూడా ఎక్కువే. కాని భారత దేశం లో ఓటు హక్కును వినియోగించుకునేవారి సంఖ్య మాత్రం తక్కువనే చెప్పాలి. ఓటు హక్కును వినియోగించుకునేవారిలో అత్యధికులు నిరక్ష్యరాస్యులు, సమస్యల పట్ల అవగాహనా లోపం ఉన్నటువంటి పేద ప్రజానీకం. ఎన్నికల పట్ల వీరు చూపే శ్రద్ధ లో పదవ వంతు శ్రద్ధ కూడా మధ్యతరగతి వారు చూపడం లేదు. సమాజ స్థితిగతుల పట్ల కొద్దో గొప్పో అవగాహన కలిగి, అధిక అక్షరాస్యత సాధించిన మధ్యతరగతి ప్రజల పాత్ర ఎన్నికల సమయంలో బహు స్వల్పంగా ఉంటోంది. అంటే ఎన్నికల ఫలితాలు ఒక వర్గ ప్రజల నిర్ణయాన్నే తెలియజేస్తున్నాయి. ఇది శోచనీయం. ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు.

చరిత్ర చూస్తే ఏ విప్లవానికైనా నాంది మధ్యతరగతి ప్రజలే అనేది స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి మధ్యతరగతి ప్రజలు ఎన్నికల పట్ల అనాసక్తి, నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. "ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేమీలేదు" అనేది వారి వాదన. ఉద్యోగులు ఎన్నికల నిర్వాహణలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించడంలో అశ్రద్ధ చూపుతున్నారు. మరి కొందరు "క్యూ లో అంత సేపు ఎవరు నుంచుంటారు" అని వాపోతున్నారు. మహిళలు "ఇప్పుడు బయటికి ఏమి వెళ్తాములే" అని బద్దకిస్తున్నారు. మధ్యతరగతి వారు ఈ ఆలోచనా సరళిని మార్చుకోవాలి, నిర్లిప్తతనుండి బయట పడాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం వారి ప్రథమ కర్తవ్యముగా గుర్తించాలి. ఐదు సంవత్సరాలు మనలను ఎవరు పాలిస్తే న్యాయం జరుగుతుందో ఓటు ద్వార తెలియజేయాలి. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకోవాలి. క్యూలో నించోవడం క్రమశిక్షణకు నిదర్శనం అని గ్రహించాలి. పోలింగ్ రోజును సెలవు దినం అనుకోకూడదు. ఆ రోజు మనం గొప్ప కర్తవ్యాన్ని నెరవేర్చబోతున్నామని గుర్తించాలి. పోలింగ్ రోజు పేద ప్రజలలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఓట్లు వేయడాన్ని వీరు "ఓట్ల పండగ" అంటారు. కుటుంబాలు కుటుంబాలు తరలి వెళ్ళి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ పద్దతి మధ్యతరగతి వారికి ఆచరణీయం కావాలి.

మధ్యతరగతి వారు ఎలానూ ఓటు వేయరని నిర్ధారించుకున్న అభ్యర్థులు, వారి ఛాయలకు కూడా పోవడం లేదు. ఓటు ను అభ్యర్ధించడమూ లేదు. నాయకుల సంగతి అటు ఉంచితే, ప్రభుత్వం కూడ పేద ప్రజల సమస్యల పట్ల చూపుతున్న శ్రద్ధ, మధ్యతరగతి వారి సమస్యల పట్ల చూపడం లేదు. ఎలాంటి స్లం ఏరియా లో కూడా సిమెంటు రోడ్లు, వీధి లైట్లు కనిపిస్తున్నాయి కాని ఊరి మధ్యలో కొన్ని చోట్ల ఇంకా మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఇది మధ్యతరగతి వారి స్వయంకృతాపరథమే. ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు, వివిధ పార్టీ అభ్యర్ధులు పేద ప్రజానీకం పైన వరాల జల్లులు కురిపిస్తున్నారు. మధ్య తరగతి వారిని పట్టించుకున్నా జాడ లేదు. ఇంత నష్టం జరుగుతున్నా ఇంకా నిర్లిప్తత ఎందుకు? ఓటు వెయ్యండి. మీ ప్రాముఖ్యతను మీరు చాటుకోండి. పాలకులను ఎంచుకోవడం లో మీ పాత్రను మీరు పోషించండి.

ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. మన కులస్తులనూ, మతస్తులను గెలిపించుకోవాలనే ఆలోచన కూడదు. అన్ని కులాలను, అన్ని మతాలనూ సమానం గా ఆదరించే అభ్యర్థి, నిజాయితీ పరుడు, విద్యావంతుడు, సమాజ శ్రేయస్సు కోరుకునే అభ్యర్థి, నిస్వార్థపరుడు, ప్రస్తుత సమాజ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించగల సమర్థుడు మనకు కావాలి. అలాంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి. డబ్బులు పంచే వ్యక్తి మనకు వద్దు. మద్యం చూపి ఓటు అడిగే అభ్యర్థి అసలు వద్దు. ఆర్భాటంగా ప్రచారం సాగించే వ్యక్తిని పక్కకు పెట్టండి. ప్రచారానికి లక్షలు, కోట్లు ఖర్చుపెట్టే వ్యక్తి గెలిచిన తరువాత ఆ డబ్బు రాబట్టుకోడానికి ప్రక్కద్రోవ పట్టడా? ఆలోచించండీ. కాబట్టి ఆడంబర ప్రచారానికి మోసపోకుండా నిరాడంబర వ్యక్తికి, మంచివ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఓటు వేయండి.

కొందరు ఓటర్లు, ప్రజలందరూ ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారో తెలుసుకొని ఆ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలనే ఆలోచన కలిగి ఉంటున్నారు. ఇతర అభ్యర్థులకు వేస్తే ఓటు వేస్ట్ అవుతుంది అని భ్రమ పడుతున్నారు. ఈ ఆలోచన సముచితమయినది కాదు. అన్ని విధాలా యోగ్యుడు అనుకున్న వ్యక్తికే ఓటు వేయండి. ఎవరో ఏదో అన్నారని మీ అభిప్రాయాన్ని మార్చుకుని అసమర్థుడిని సమర్థించకండి.

మన ఇంట్లో కష్టపడి సంపాదించుకున్న మన డబ్బు ఎవరికైనా ఉచితంగా ఇవ్వగలమా? అలా ఇస్తే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుందా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోని డబ్బును ఉచితంగా పంచిపెడితే, ఆ రాష్ట్రం మాత్రం అభివృద్ధి ఎలా సాధిస్తుంది? కులమతాలకు అతీతంగా ఆర్థికముగా వెనుక బడి ఉన్న వారికి చేయూత నీయవలసిందే. వారి కూడు, గుడ్డా, వాళ్ళు సంపాదించుకునేట్టుగా వారిని తయారుచేయవలసిందే. కాని డబ్బు పంచడం వలన ఇది సాధ్యం కాదు. పేద వారు పేద వారు గానే ఉండి పోతున్నారు. కాబట్టి ఉచితంగా డబ్బులు పంచిపెట్టే నాయకులు మనకొద్దు. మన జీవన ప్రమాణం పెంచి తద్వారా సమాజాభివృద్ధికి కృషి చేసే నాయకుడికి ఓటు వేయండి.

ఓటరు ముందుగా తన సమాజంలోని సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలి.ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గురించి తెలుసుకోవాలి. ఈ సమాచారం వార్తా పత్రికలు, వెబ్ సైట్ల నుండి మనకు లభిస్తుంది. ఆ తరువాత ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నారుగా!!!! ఇంకా ఆలోచన ఎందుకు? అడుగు ముందుకు వేయండి. ఓటు హక్కును వినియోగించుకోండి.

క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి - ఏసు క్రీస్తు, మేరి మాత, నక్షత్రం, ఇంకా..... క్రిస్మస్ తాత.

క్రిస్మస్ తాత పిల్లలకు బోలెడు బహుమానాలు, చాక్లెట్లు ఇచ్చేవాడట. అందుకే పిల్లలకు క్రిస్మస్ తాత అంటే చాలా ఇష్టం. ఈ క్రిస్మస్ తాత బొమ్మను, మనం ఇంట్లొ ఆకర్షణీయంగా, అతి సులువుగా తయారు చేసుకొవచ్చు. అది ఎలాగో చూడండి.

కావలసిన వస్తువులు:
1. కోడిగుడ్డు డొల్ల
2. రంగు కాగితం
3. జిగురు లేదా ఫెవిక్విక్
4. నలుపు రంగు స్కెచ్ పెన్
5. దూది

తయారు చేయు విధానం:
ముందుగా రంగు కాగితమును 4 X 4 అంగుళాల సైజులో కత్తిరించుకొని, ఆ కాగితాన్ని పొట్లం చుట్టినట్లు, శంఖువు ఆకారంలో చుట్టి, కాగితం విడిపోకుండా చివరలు జిగురుతో అతికించాలి. ఇది క్రిస్మస్ తాత టోపి. కోడిగుడ్డు డొల్ల సన్నగా ఉండే భాగం పైన ఈ టోపీని బొమ్మలో ఉన్నట్లు అతికించాలి. గుడ్డు డొల్ల క్రిస్మస్ తాత ముఖం. దీని మీద నోరు, కళ్ళు, ముక్కు నలుపు రంగు స్కెచ్ పెన్ తో గీసుకోవాలి. దూదిని గడ్డం, మీసాలు, కనుబొమల ఆకారంలో మలిచి జిగురుతో అతికించాలి. టోపీ మీద చంకీలు అందంగా జిగురుతో అతికిస్తే బొమ్మ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ తాత బొమ్మ రెడీ.

అందంగా కనిపించే ఈ క్రిస్మస్ తాత బొమ్మలు అతి తక్కువ ఖర్చుతో చాలా చేసుకోవచ్చు. వీటిని క్రిస్మస్ ట్రీకి అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో గోడలకు అలంకరిస్తే ఇల్లు అందంగా ఉంటుంది, బల్లుల బెడద తగ్గుతుంది.

క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తోంది కదా! మీరు ప్రయత్నించి చూడండి.


చిన్నతనంలో ఆడ పిల్లలు పొడుగాటి జడ అంటే చాలు తెగ మోజుపడిపోతారు. పొడుగు జడ ఉన్నవారిని చూసి మురిసిపోతారు. తమకు అంత పెద్ద జడ ఉంటే బాగుండునని కోరుకుంటారు. జడ అందం అలాంటిది మరి.

చిన్న వయస్సులో పొడవు జుట్టు ఉండదు కాబట్టి తల్లి తన కూతురికి క్రాఫ్ దువ్వి వదిలేస్తుంది. జుట్టు కొంచెం ఎదిగితే చిన్న చిన్న పిలకలు వేసి ముచ్చటపడుతుంది. ఈ దశలోనే ఆడపిల్లలు పొడుగాటి జడ మీద మమకారం పెంచుకుంటారు. పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు (అమ్మ చూస్తే కోప్పడుతుందని తెలుసు) సవరమో, నల్ల రిబ్బనో ఎంచుకొని వాటితో తమకు తోచినట్లు పెద్ద జడ అల్లుకొని తెగ సంబరపడిపోతారు. జుట్టు మెడ క్రిందకు జారిన తరువాత తల్లి జడ వేయడం మొదలుపెడుతుంది. అప్పుడు ఆడపిల్లకు జడ ఎలా అల్లాలి అనే ధర్మసందేహం కలుగుతుంది. అమ్మ రోజూ ఎలా అల్లుతుందో గమనిస్తుంది. అల్లడం తేలికని భావించి తాను అల్లడానికి ఉపయుక్తులవుతారు. జడలో రెండు పాయలేగా కనిపించేవి అనుకుని జుట్టును రెండు భాగాలు చేసి జడను అల్లడం ప్రారంభిస్తారు. ఇక్కడే పప్పులో కాలు వేస్తారు. జడలో అటొకటి ఇటొకటి రెండు పాయలే కనిపించినా నిజానికి జుట్టును మూడు భాగాలు చేస్తేగాని జడ అల్లడం సాధ్యం కాదని ఆ పసి మనసుకు తెలియదు. ఇదంతా తెలిసే సరికి పిల్లలు ఎదిగిపోతారు. జుట్టును చిక్కు లేకుండా దువ్వి, మూడు సమభాగాలు చేసి అందంగా జడ అల్లడం కస్టమే సుమా - అని అప్పుడు అనుకుంటారు.

దక్షిణ భారతదేశంలో జడ చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అందునా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో దీనికి విశిష్ట స్థానం ఉంది. ఆడపిల్ల అందాన్ని ఇనుమడింపజేసే అంశాలలో జడ ఒకటి అనడంలో సందేహం లేదు. అందుకేనేనేమో ఎందరో కవులు జడ సొగసు మీద ఎన్నో కవితలు రాశారు. శాస్త్రీయ నృత్యాలయిన కూచిపూడి, భరతనాట్యం జోలికి వెళ్ళదలచుకుంటే ఆడపిల్లకు జడ చాలా అవసరం. అది లేకుంటే ఆహార్యంలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సత్యభామ ఠీవికి అసలు కారణం ఈ జడే. పొడుగాటి జడ వయ్యారంగా తిప్పుతూ "మీరజాలగలడా నా ఆనతి" అని సత్యభామ నర్తిస్తుంటే జనం కళ్ళప్పగించి చూడ వలిసినదే.

ఆరు అణాల అంధ్రా అమ్మాయి అంటే జడ ఉండి తీరాల్సిందే. పెళ్ళి కూతురు అనగానే మన మదిలో మెదిలేది బారెడు పూల జడే. జడకు అంత ప్రాముఖ్యత ఉండబట్టే ఆడపిల్లను కుదురుగా కూర్చోబెట్టి అమ్మో, అమ్మమ్మో, నాయనమ్మో, జాగ్రత్తగా చిక్కు తీసి, నూనె రాసి జుట్టు దువ్వేవారు. బిగించిమరీ జడలేసేవారు. జుట్టు చివరిలో చిట్లితే పెరగవేమోనని రిబ్బను వేసిమరీ అల్లేవాళ్ళు. కాసేపు జుట్టు వదిలేసినా "దయ్యంలా ఎంటాజుట్టు విరబోసుకు తిరగడం" అని పెద్దవాళ్ళు మందలించిన సందర్భాలు లేకపోలేదు. జుట్టును జడరూపంలో మలిస్తే, ఒక్క వెంట్రుక కూడా రేగే అవకాశం ఉండదు కదా, తలకట్టు చాలా శుభ్రంగా కనిపిస్తుంది. జుట్టు రేగితే "కాకిగూడు" అనో, "చింపిరిజుట్టు" అనో సాటివారు ఏడిపించడం పరమ సాధారణం. ఇది ఒకప్పటి సంగతి.

ఇక అసలు విషయానికి వస్తే నేడు "జడ" కనుమరుగయిపోతున్నది. అంధ్రుల నాగరికతను వెలుగెత్తి చాటే ఒక అంశం అయిన జడను వేసుకోడానికి నేటి యువతరం విముఖత వ్యక్తపరుస్తోంది. పల్లెటూర్లలో, పట్టణాలలో జడ కొంతమేరయినా కనిపిస్తుంది కాని, నగరాలలో జడ చేజారిపొయిందనే చెప్పాలి. దీనికి సవాలక్ష కారణాలు - జడ వేసుకునే సమయం లేని యాంత్రిక జీవితం, జడ అల్లుకునే ఓర్పు నశించడం, చినప్పుడే పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్సులో పడివేయడం, పెద్దజుట్టు ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, పెద్దజుట్టు ఉన్నా తలంటు కష్టం అనే భావనతో జుట్టు కత్తిరించుకోవడం, బాబ్ పోనీ నాగరికత చిహ్నాలుగా మారడం, బాబ్ పోనీ దువ్వడం సులభకరం కావడం, పాశ్చాత్య నాగరికతా వ్యామోహం - లా కర్ణుడి చావుకు లక్షాతొంభై కారణాలు.

సాధారణంగా యువతరం సినీ నాయికలను, బుల్లితెర మీద కనిపించే స్త్రీలను అనుసరిస్తుంటారు. నేటి సినిమాలలో జడ కేవలం ఒక పేదింటి అమ్మయికి లేదా చదువు లేని పల్లెటూరి అమ్మాయికి పరిమితమయిపోయింది. చదువుకున్న అమ్మాయికి జడ ఉండదు, ఉండకూడదు. బాబ్ లేక పోనీ ఉండాలి. ఇది నేటి పరిస్థితి. గొప్పింటి పిల్లకు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా జడ కనుమరుగై పోయింది. తెలుగు ప్రజల కోసం తెలుగువారు నిర్వహిస్తున్న, తెలుగు టీ.వీ చానల్సు లోని తెలుగింటి యాంకర్లు కూడా జడను చిన్న చూపే చూస్తున్నారు. పండగలకు పబ్బాలకు మాత్రం పట్టుచీర కట్టుకొని వంటినిండా నగలతో (వడ్డాణం కూడ వదలరు సుమా) ముస్తాబవుతున్నారు. కాని జడ జోలికి మాత్రం పోవడం లేదు. దీనితో మధ్య తరగతి యువతులు కూడా జడ వేసుకోవడం అనాగరికం అనే భావనకు వచ్చేసినట్లున్నారు. ఏది ఏమైనా నేటి యువత బాబ్ చేసుకుని జుట్టు ముఖం మీద పడుతుంటే చికాకు పడకుండా, సుతారంగా సర్దుకోవడం నాగరికం - అనే దశకు చేరుకున్నారు.

ఒక తెలుగింటి అమ్మయిని ఎవరైనా ఎలా ఊహిస్తారు? అదే చిత్రాకారుడైతే ఎలా చిత్రీకరిస్తాడు? రెండు సందర్భాలలోను బారెడు జడ నడుముపై నర్తిస్తున్న అమ్మాయే మన ఊహల్లో కదలాడుతుంది. తెలుగింటి ఆడపిల్లకూ, బారెడు జడకూ మధ్య ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. అందుకేనేమో కొందరు తెలుగింటి ఆడపడుచులు వృత్తిరీత్యా లేదా చదువురీత్యా దేశాలు వెళ్ళినా, విడుపు లేక జడ సాంప్రదాయాన్ని అక్కడ కూడా కొనసాగిస్తున్నారు. మరికొందరు విదేశీ సాంప్రదాయం మేర అక్కడ బాబ్ చేసుకొని జుట్టు వదిలేసుకున్నా ఇక్కడకు వచినప్పుడు చక్కగా జడ వేసుకుంటున్నారు. తెలుగు వారి జడ సంస్కృతి చిరకాలం కొనసాగాలంటే, జడ సంస్కృతిని కూడా ప్రాచీన సంస్కృతిగా చట్టం తీసుకురావాలేమో.

జుట్టును మనం కోరిన రీతిలో మలచుకునే స్వేఛ్ఛ మనందరికీ ఉంది. పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇందులో తలదూర్చే అధికారం ఎవరికీ లేదు, కాని వ్యక్తిగత స్వేఛ్ఛకు మించినది ఒకటి ఉన్నది - అది సామాజిక భాధ్యత. మన మంచి సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించడం మన బాధ్యత. జడ అనాగరిక చిహ్నం, బాబ్ నాగరిక చిహ్నం అనే భావన మనం విడనాడాలి. లేకుంటే భావి తరాల వారు తెలుగింటి అమ్మాయి బొమ్మను బాబ్ తో ఊహించే (చిత్రీకరించే) ప్రమాదం ఏర్పడుతుంది.

అమెరిక అధ్యక్షునిగా బరాక్ హుసేన్ ఒబామ చారిత్ర్యాత్మక గెలుపు అనంతరం మెక్ కెయిన్, అతని ప్రత్యర్ధి ఇచ్చిన కన్సెషన్ స్పీచ్ వినిన ఎలాంటి మానవుడైన చలించక మానడు, హృదయం ధ్రవించక పోదు, కళ్ళు చమర్చక మానవు. మెక్ కెయిన్ సందేశాన్ని విన్న అశేష అమెరిక ప్రజానీకం చేసినది కూడా అదే. మానవతా విలువలు అడుగంటి పోతున్న ఈ రోజులలో, రాజకీయలలో మానవతా విలువల ఆచరణ అసాధ్యం అనుకునే నేటి తరుణంలో మెక్ కెయిన్ సందేశం ప్రపంచానికి ఒక మేలుకొలుపు.

బరాక్ ఒబామాని అభినందిస్తూ మెక్ కెయిన్ ప్రారంభించిన సందేశంలోని ప్రతీ పదం మరపురానిది, మరచిపోలేనిది. ఒబామాకు, తనకు మధ్య సంబంధాన్ని చాలా క్లుప్తంగా, గంభీరంగా చెప్తూ "హి వాజ్ మై ఫార్మర్ అప్పొనెంట్ టుడే హి ఈజ్ మై ప్రెసిడెంట్" అన్నారు. ఈ విధంగా రాజకీయ ప్రత్యర్ధి గురించి మాట్లాడాలంటే మనిషి కి ఎంత విశాల హృదయం, ఉదార స్వభావం కావాలి? అంతే కాదు అహంభావానికి, అసూయకు, ఈర్ష్య, ధ్వేషాలకు తాను అతీతుడినని మెక్ కెయిన్ ఈ సందేశం ద్వార నిరూపించుకున్నారు.
"హిజ్ సక్సెస్ కమాండ్స్ మై రెస్పెక్ట్" అని కొనసాగిన అతని సందేశం ఒబామ గెలుపుని తాను గౌరవిస్తున్నట్లు చెపుతున్నది. "ముందుగా మేము అమెరికా పౌరులము, అమెరికాను శిఖరాగ్రాన నిలపడమే మా అందరి లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం నేను నా పూర్తి సహకారాన్ని అందిస్తాను" అని వారు చేసిన వాగ్ధానం అసమానం, అపూర్వం.


అమెరికా లోని ఒక రాజకీయ ప్రత్యర్థి ఓడిన తరువాత గెలుపొందిన వ్యక్తిని ఉద్దేశించి దేశ భవితను కోరి ఇచ్చిన ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. ఒక రాజకీయ ప్రత్యర్ధి బాధ్యత, వైఖరి, ప్రవర్తన, ఆలోచన ఎలా ఉండాలి అనేవి ఈ సందేశంలో ప్రతిబింబిస్తున్నాయి. కొన్ని నెలలలో ఎన్నికలను ఎదుర్కొనబోతున్న ప్రతి భారతీయుడు దీని గురించి అలోచించాల్సిందే. ఈ రాజకీయ విజ్ఞత భారతీయులందరికి ఆదర్శం కావల్సిందే.
ఆంధ్రప్రదేశ్ భాషాపరంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం అని మన అందరికి తెలుసు. మన ప్రాంతీయ భాష తెలుగు అని తెలుసు. పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి, అశువులు బాసిన మహనీయుడు అని తెలుసు.

తెలుగు భాషను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అంటారని తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగును "దేశభాషలందు తెలుగు లెస్స" (less కాదు సుమా!) అని కొనియాడిన సంగతీ తెలుసు. సి. పి. బ్రౌన్ అను ఆంగ్ల మహనీయుడు భారతదేశం వచ్చి, తెలుగు నేర్చుకొని, తెలుగు మీది మమకారంతో తాళపత్రాల రూపంలో ఉన్న తెలుగు సాహిత్యాన్ని వెలికి తీయించి, గ్రంథాలుగా ముద్రించి, తెలుగుకు అపార సేవ చేసిన విషయం తెలుసు. అంతే కాదు, ఆయన ఆంగ్లం నుండి తెలుగుకి, తెలుగు నుండి ఆంగ్లానికి, నిఘంటువులు వ్రాసి, వాటిని ముద్రించి, మనకు అందుబాటులో ఉంచిన సంగతీ తెలుసు.

మరి ఇన్ని విశిష్టతలున్న తెలుగుభాష నేడు ఎంత నిరాదరణకు గురి అవుతున్నదో మనకెందుకు తెలియడం లేదు? ఈ నిరాదరణకు కారణం మనమే అని కూడా తెలియడం లేదే!

మనసుకు బాధ కలిగినా, శరీరానికి గాయమైనా అనాలోచితంగా, మన నోటి వెంట వెలువడే పదం "అమ్మ". ఇది ప్రేమతో కూడిన తెలుగువారి కమ్మని పదం. 'Mummy' అనే పదంలో ఈ కమ్మదనం మనకు కలుగుతుందా? క్రిందపడినప్పుడు 'అమ్మా'కి బదులు 'Mummy' అనగలమా? నేటి సమాజంలో 'అమ్మా అనే ఈ పదం ఆప్యాయతను కొల్పోయి, క్రింది ఉద్యోగస్తులు, పై ఉద్యోగినిని; పనిమనిషి, యింటి యజమానురాలిని సంబోధించడానికి పరిమితమవడం శోచనీయం.

ఇద్దరు తమిళులు కలిస్తే, తమిళంలో స్వేచ్ఛగా సంభాషించుకుంటారు. ఇద్దరు మరాఠీలు ఎదురైతే తనివితీరా మరాఠీలో కుశల ప్రశ్నలు వేసుకుంటారు. ఇద్దరు కేరళీయులు తారసపడితే మలయాళంలో మనసు విప్పి మాట్లాడుకుంటారు. మరి తెలుగు వారు.......? తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగులో సంభాషించుకోవడానికి ఎందుకు అయిష్టత చూపుతున్నారు? తెలుగు మాట్లాడటం అనాగరికం అని, ఎదుటివారు చిన్నచూపు చూస్తారని అనుకొంటున్నారే? వచ్చీరాని ఇంగ్లీషు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు గాని, తెలుగు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.

నా చిన్నప్పుడు స్కూల్లో కొంతమంది విద్యార్థులు 'తెలుగు 'ని 'తెగులు ' అని హాస్యాన్ని పలికేవారు. అప్పుడు మా టీచర్ వారి చెవి మెలిపెట్టి, 'తెలుగు ' అని వారిచే 100 సార్లు చెప్పించి, వ్రాయించేవారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది 'నిజంగానే తెలుగుకి తెగులు పట్టిందా' అని.

ఈ మధ్య గమనిస్తున్నాను. విద్యార్థులు, తెలుగు మీడియంలో చదవడం వలన, కాలేజీలో ఆంగ్ల మాధ్యంలో చదవలేకపోతున్నాం అంటున్నారు. ఇది వాస్తవం కాదు. మాతృభాష మీద పట్టు సాధించినపుడు మాత్రమే విద్యార్థి మరే భాషనైనా నేర్చుకోగలుగుతాడు. నేటి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవలేక విఫలమవడానికి కారణం, మాతృభాషమీద పట్టు సాధించలేక పోవడమే. పూర్వం విద్యార్థులు ఎందరో ఎస్.ఎస్.ఎల్.సి. వరకు స్కూల్లో తెలుగు మాధ్యమంలో చదివి, కాలేజి చదువులను ఆంగ్ల మాధ్యమంలో కొనసాగించి రెండు భాషలలోనూ పట్టు సాధించి ఉన్నత పదవులను అలంకరించి, ఎంతో కీర్తి గడించలేదా?

మాతృభాషను నిర్లక్ష్యం చేయడం, మాతృమూర్తిని నిర్లక్ష్యం చేయడమే. ఇది క్షమార్హం కాదు. ఇప్పటికే తెలుగులో చాలా ఇంగ్లీషు పదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని పదాలను ఆంగ్లంలోనే వాడుతున్నాం. తెలుగు పదాలు వాడుకలోనే లేకుండా పోయినాయి. 'Road ' అంటే బాట అని చాలా తక్కువ మందికి తెలుసు. 'Pen ' అంటే తెలుసుగాని 'కలం' అంటే తెల్లముఖమే! 'Train' ని 'ధూమశకటం' అంటారని బహుకొద్ది మందికే తెలుసు. ఇలా కొన్ని తెలుగు పదాలు వాడుక నుండి తప్పుకున్నాయి. ఒక్క ఇంగ్లీషు పదం లేకుండా తెలుగు మాట్లాడలేని పరిస్థితి మనది. దీనికి తోడు 'శ ' కు బదులు 'ష ' పలకడం నాగరికం అయిపోయింది. 'ఆకాశం'ని 'ఆకాషం'గా, 'అవకాశం'ని 'అవకాషం'గా, 'శేఖర్ 'ని 'షేఖర్ 'గా, 'శైలజ 'ని 'షైలజ 'గా పలుకుతూ, అదే నాగరికత అని మురిసిపోతున్నాం. తెలుగుని ఇంత కల్తీ చేస్తే, మనం మన భావితరాలకు స్వచ్ఛమైన తెలుగు అందివ్వగలమా?


అన్ని భాషలు సమానమని మనం గ్రహించాలి. ఒక భాష ఎక్కువా కాదు. మరో భాష తక్కువా కాదు. ఎవరి భాష వారిది. మన భాషలో మనం మాట్లాడడం అనాగరికం అని అనుకోకూడదు. తెలుగులో మాట్లాడితే అనాగరికమూ కాదు. ఇంగ్లీషులో మాట్లాడితే నాగరికమూ కాదు. అవసరాన్ని బట్టి ఏ భాషనైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. భాషను బట్టి మనిషి విలువ పెరగదు. తరగదు. భాషపైన ఎంత పట్టు సాధించగలిగాం, మనలోని భావాలను, మనకున్న విషయ పరిజ్ఞానాన్ని ఆ భాషలో ఎంతవరకు వ్యక్తపరచగలుగుతున్నాము అనేదే ముఖ్యం.